సాధారణ తలనొప్పి, మైగ్రేన్ మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? వీటిని ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో తలనొప్పి చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. కానీ అదే నొప్పి తరచూ వస్తూ, ఎక్కువగా బాధిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో అది మైగ్రేన్ కూడా కావచ్చు. అందుకే సాధారణ తలనొప్పి, మైగ్రేన్ మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుభవించే సమస్య. చాలామంది దీనిని చిన్న విషయంగా తీసుకుని మందులు వేసుకుంటారు లేదా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. కానీ తలనొప్పి తరచూ రావడం, ఎక్కువసేపు ఉండటం లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే దాన్ని తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మైగ్రేన్కు సంకేతం కావచ్చు. సమయానికి తేడాను గుర్తించకపోతే నొప్పి మరింత పెరిగి దీర్ఘకాల సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు, మహిళలు, యువత ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి పునరావృతమయ్యే తలనొప్పి ఏ సమస్యను సూచిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మైగ్రేన్ – సాధారణ తలనొప్పి మధ్య తేడా..
సాధారణ తలనొప్పి
తేలికపాటి లేదా మధ్యస్థ నొప్పిగా ఉంటుంది. తల మొత్తం లేదా నుదిటి వద్ద ఒత్తిడిలా అనిపిస్తుంది. అలసట, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ వాడటం వల్ల ఇది వస్తుంది. సాధారణంగా విశ్రాంతితో లేదా మందులతో తగ్గిపోతుంది.
మైగ్రేన్
ఎక్కువగా తల ఒక వైపునే పదునైన, కొట్టుకుంటున్నట్టుగా నొప్పి ఉంటుంది. వాంతులు, వికారం, కాంతి లేదా శబ్దానికి అసౌకర్యం కలుగుతుంది. ఈ నొప్పి కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కొనసాగుతుంది. సాధారణ మందులతో తగ్గకపోవచ్చు. ప్రత్యేక చికిత్స అవసరం.
మైగ్రేన్ను ఎలా నివారించాలి?
- తగినంత నిద్రపోవాలి, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
- ఎక్కువ కాంతి, గట్టిగా శబ్దాలు, అధిక స్క్రీన్ టైమ్ను తగ్గించాలి.
- ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి.
- ఎక్కువసేపు ఉపవాసం ఉండకూడదు, సమయానికి సమతుల్య ఆహారం తినాలి.
- అధిక కెఫిన్, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్ను తగ్గించాలి.
- మైగ్రేన్ను ప్రేరేపించే కారణాలను గుర్తించి దూరంగా ఉండాలి.
- అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి.
సాధారణ తలనొప్పిని ఎలా నివారించాలి?
- తగినంత నీరు తాగాలి.
- మొబైల్, కంప్యూటర్ను ఎక్కువసేపు చూడకుండా మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
- ఒత్తిడిని తగ్గించుకోవాలి, తేలికపాటి వ్యాయామం చేయాలి.
- సరైన భంగిమలో కూర్చోవాలి. మెడ, భుజాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
- సమయానికి భోజనం, సరైన నిద్ర అలవాటు చేసుకోవాలి.
- తలనొప్పి తరచూ వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

