
రౌడీషీటర్లకు షాక్ ఇస్తున్న సాఫ్ట్వేర్ – వారు ఉండే ప్రాంతం తెలిస్తే చాలు- 17 మందిని పట్టిచ్చిన పరిజ్ఞానం*
గుంటూరు
:
మొబైల్ లేకపోయినా
ఆధార్ నంబర్ లేకపోయినా
పక్కా అడ్రస్ తెలియకపోయినా
వారు ఉండే ప్రాంతం తెలిస్తే చాలు ఆ సాఫ్ట్వేర్ పట్టేస్తుంది.
దీని సహాయంతో పోలీసులకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్న 17 మంది రౌడీషీటర్లను వెతికి పట్టుకొచ్చారు
గుంటూరు జిల్లా పోలీసులు.
ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను కేంద్రం రూపొందించింది.
సాంకేతిక పట్టభద్రుడైన జిల్లా ఎస్పీ సతీష్కుమార్ దీన్ని అందిపుచ్చుకున్నారు.
కొందరు రౌడీషీటర్లు సెల్ఫోన్లు వినియోగించకుండా పోలీసుల కౌన్సెలింగ్కు హాజరవకుండా నేరాలకు పాల్పడుతున్నారు.
వీరందరూ రికార్డుల్లో ఉన్నా వివరాలేమీ పోలీసుల వద్ద లేవు.
వారిని పట్టుకుందామంటే మొబైల్స్ వినియోగించడం లేదని సీఐ, ఎస్సైలు పట్టించుకోవడం మానేశారు.
దీన్ని అలుసుగా తీసుకున్న రౌడీషీటర్లు చాటుమాటున రెచ్చిపోతున్నారు.
ఇటీవల పాతగుంటూరు స్టేషన్ పరిధిలో ఆసిఫ్ అనే ఏ1 రౌడీషీటర్ ఓ హత్య ఘటనలో పాల్గొన్నాడు.
అతడిని పట్టుకోవాలని ఎస్సీ సతీష్కుమార్ పోలీసులను ఆదేశించగా వారు నీళ్లు నమిలారు.
ఆసిఫ్ రెండు సంవత్సరాలుగా కౌన్సెలింగ్కు రావడం లేదని పోలీసులు ఎస్పీ సతీష్కుమార్కు తెలిపారు. విజయవాడలో తలదాచుకుంటున్నాడని చెప్పారు. అలాంటివారు నేర ఘటనల్లో పాల్గొంటున్నా చిరునామా లేదని వదిలేయడమేనా? అంటూ కిందిస్థాయి అధికారులపై ఎస్పీ మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగించి ఆసిఫ్ ఎక్కడున్నదీ గుర్తించి పట్టుకున్నారు. మరో 16 మంది ఆచూకీ కూడా గుర్తించి పోలీస్స్టేషన్లకు రప్పించారు.
ఎలా గుర్తిస్తున్నారంటే : సాధారణంగా ఏదైనా కేసులో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు అతడి సెల్ఫోన్పై నిఘా పెడుతుంటారు. టవర్ లొకేషన్ను బట్టి శోధించి అదుపులోకి తీసుకుంటుంటారు. అసలు మొబైల్ కూడా వాడని వారిని పట్టుకోవడమే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్వేర్ ప్రత్యేకత. నిందితులు ఎక్కడుంటున్నదీ పక్కా చిరునామా తెలియకపోయినా ఏ ప్రాంతంలో ఉంటున్నారో తెలిస్తే చాలని పోలీసులు పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్ సహాయంతో ఆ ప్రాంత లొకేషన్ తీసుకుని నిందితుడు/రౌడీషీటర్ ఫొటో ఆధారంగా ఏ ఇంట్లో ఉన్నాడో గుర్తించొచ్చని పోలీసులు వివరించారు. ఈ సాఫ్ట్వేర్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. లాగిన్, పాస్వర్డ్ కేవలం ఎస్పీ వద్దనే ఉంటాయి. దీని సహాయంతో జిల్లాలో తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్లందరినీ గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.