భగినీ హస్త భోజనం

భగినీ హస్త భోజనం దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు.భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకొంటారు.ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు.భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించింది.
పురాణ గా
సూర్యుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు యమధర్మరాజు, అమ్మాయిపేరు యమున చెల్లెలికి అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు.చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.యమునకు, యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది. సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు-సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది.
జరుపుకునే విధానం
పండగను దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు.దీనిని భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకొంటారు.ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.హరియాణా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు. మహారాష్ట్రలో ఈ పండుగను భయ్యా దుజ్ అని పిలుస్తారు. నేపాల్ ప్రాంతంలో భాయి టికా అని పిలుస్తారు. పంజాబ్ ప్రాంతంలో ఈపండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు.
