భర్తను చంపి.. ‘దృశ్యం’ స్టైల్లో ఇంటిలోనే మృతదేహం పూడ్చిపెట్టింది!

మహారాష్ట్రలో ఓ భార్య ప్రియుడి మోజులో భర్తను అతి దారుణంగా చంపేసింది. ‘దృశ్యం’ సినిమాను తలపించేలా అతడి శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. అసలేం జరిగిందంటే, కోమల్ అనే మహిళ తన భర్త విజయ్ను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి నేల కింద పాతిపెట్టింది. రెండు వారాల తర్వాత విషయం బయటపడటంతో అంతా షాక్ తిన్నారు. ఈ దారుణ ఘటన వెనుక అసలు కారణాలేంటి?
హైలైట్:
- 15 రోజుల కిందట అదృశ్యమైన భర్త
- వెతుకొంటూ అతడికి ఇంటికి సోదరులు
- ఫ్లోర్ టైల్స్ తేడాగా ఉండటంతో అనుమానం
రోజు రోజుకూ మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి జీవిత భాగస్వాములను కడతేర్చడానికి కూడా వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న ఈ విపరీత పోకడలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ… కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్నారు. రోజూ ఇటువంటి ఘటనలు దేశంలో ఏదో ఒక చోటు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలో మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, తెలంగాణలో తేజేశ్వర్ హత్య కేసు మేఘాలయ ఘటనను మించిపోయింది. అలాగే, తమిళనాడులో ఓ మహిళ ఏకంగా సాంబారులోనే విషం కలిపి భర్త ప్రాణాలు తీసింది.
తాజాగా, ఓ మహిళ తన భర్తను హత్యచేసి.. ఇంటిలోపలే శవాన్ని పూడ్చిపెట్టింది. ‘దృశ్యం’ను తలపించే అత్యంత భయానక ఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. గడగపడా-నలాస్పొరాలో కోమల్ చవాన్ అనే మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి ఇంట్లోనే గొయ్యి తీసి పాతేసింది. రెండు వారాల కిందట జరిగిన ఈ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో కోమల్ (28), తన భర్త విజయ్ చవాన్ (35)తో కలిసి ఉంటోంది. అయితే, గత 15 రోజులుగా విజయ్ అదృశ్యమయ్యాడు.

