ఎందుకంటే రూ. 25,000 కంటే ఎక్కువ లావాదేవీలపై బ్యాంకు సర్వీస్ ఛార్జీలను విధించనుంది.
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఐఎంపీఎస్ ఛార్జీలను సవరించింది. ఆన్లైన్ ఐఎంపీఎస్ లావాదేవీలలో చాలా వరకు ఇకపై ఉచితంగా లభించవు. ఎందుకంటే రూ. 25,000 కంటే ఎక్కువ లావాదేవీలపై బ్యాంకు సర్వీస్ ఛార్జీలను విధించనుంది. దీంతో రూ. 5 లక్షల వరకు ఉన్న అన్ని ఐఎంపీఎస్ లావాదేవీలు ఉచితంగా అందించే పాత విధానాన్ని ఎస్బీఐ తొలగించనుంది. అయితే, అన్ని ఎస్బీఐ బ్రాంచ్ల ద్వారా చేసే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీల రేట్లు యథాతథంగా ఉంటాయి.
బ్యాంకు వివరాల ప్రకారం, రూ. 25,000 కంటే ఎక్కువ మొత్తంలో ఆన్లైన్ ఐఎంపీఎస్ బదిలీలకు స్వల్ప రుసుములను వసూలు చేయడం ప్రారంభిస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది. రూ.25,000 నుంచి రూ. 1 లక్ష వరకు బదిలీలకు రూ. 2 + జీఎస్టీ, రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బదిలీలకు రూ. 6 + జీఎస్టీ, రూ. 2-5 లక్షల బదిలీలకు రూ. 10 + జీఎస్టీ వర్తిస్తుంది. రూ. 25,000లోపు ఆన్లైన్ ఐఎంపీఎస్ బదిలీలు గతంలో మాదిరిగానే ఎలాంటి ఛార్జీలు ఉండవు. బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ బదిలీలు చేస్తే, పాత ఛార్జీలే వర్తిస్తాయి. జీతం లేదా ప్రత్యేక పొదుపు ఖాతాలకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

