ఏపీ వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రారంభం కానున్నాయి. దీంతో ఇంటర్ బోర్డ్ అధికారులు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు..
ఏపీ వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రారంభం కానున్నాయి. దీంతో ఇంటర్ బోర్డ్ అధికారులు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10,57,312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఇక పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలపై బోర్డు పూర్తిస్థాయి నిషేధం విధించారు.
మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర డిజిటల్ గాడ్జెట్లను పరీక్షా హాలులోకి తీసుకురావడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.. విద్యార్థులతో పాటు పర్యవేక్షణ చేసే సిబ్బందికి కూడా సెల్ ఫోన్ల అనుమతి ఉండదని, ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సిసిటివి (CCTV) కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని నేరుగా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ ప్రత్యేక బస్సు సర్సీసును నడుపుతున్నట్లు తెలిపారు.

