మకర సంక్రమణం.. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ కాలాన్ని మకర సంక్రమణంగా పిలుస్తారు.
మకర సంక్రమణం.. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ కాలాన్ని మకర సంక్రమణంగా పిలుస్తారు. అదే మకర సంక్రాంతి అయింది. మకర సంక్రమణం పుణ్యకాలాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో ఈనెల రేపటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు ఈనెల 18వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈనెల ఉదయం 12వ తేదీన ఉదయం 9.15 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోకాయుక్త కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. చండీశ్వరుడికి విశేష పూజలు చేస్తారు.
జనవరి 13వ తేదీ నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్లకు వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. 15న స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం చేయనున్నారు. ఈ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు గిరిజన భక్తులను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఇది ఏనాటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇలా చెంచు గిరిజనులను ఆహ్వానించడం వెనుక ఒక కారణం ఉంది.
చెంచుల అల్లుడు చెంచు మల్లయ్య
చెంచులు శివుడిని “చెంచు మల్లయ్య” అని పిలుచుకుంటారు. స్వామివారికి వీరు సమర్పించే తేనె, పండ్లు, అటవీ ఉత్పత్తులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైల గిరి ప్రదక్షిణ చేసే సమయంలోనూ చెంచులకు అగ్రతాంబూలం దక్కుతుంది. పురాణాల ప్రకారం, శివుడు కిరాత రూపాన్ని ధరించి శ్రీశైల అడవుల్లో విహరిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలోని చెంచు జాతికి చెందిన ఒక యువతిని (చెంచు లక్ష్మి) ప్రేమించి వివాహం చేసుకున్నాడని స్థానిక కథనం. అందుకే చెంచులు మల్లికార్జున స్వామిని తమ “అల్లుడు”గా భావిస్తారు. ఈ బంధుత్వం కారణంగానే స్వామివారి కల్యాణంలో వారు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. గిరిజన సంస్కృతిని, ప్రకృతితో వారికున్న అనుబంధాన్ని గౌరవించడానికి ప్రభుత్వం, దేవస్థానం ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపిస్తాయి. వారు తీసుకువచ్చే పవిత్రమైన పుట్టమన్ను, అటవీ పూలను పూజల్లో వినియోగించడం కూడా ఒక ఆచారం.

