కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రసాద్’ పథకం పరిధిలోకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయాన్ని చేర్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రసాద్’ పథకం పరిధిలోకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయాన్ని చేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాజీ ఎంపీ గల్లా జయదేవ్తో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి (ఈవో), వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి స్వామివారి వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ..
దర్శనానంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. రాష్ట్రం ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తాను మనసారా కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

