Yesvantpur Vande Bharat Express Halt December 27: రైలు ప్రయాణికులకు శుభవార్త! యశ్వంత్పూర్-కాచిగూడ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇక హిందూపురం స్టేషన్లో ఆగనుంది. ఈ నెల 27 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రైళ్ల వల్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుందని చెబుతున్నారు.
ఏపీ, ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ ఇచ్చారు. యశ్వంత్పూర్ కాచిగూడ యశ్వంత్పూర్ వందేభారత్ (20704/20703) రైలు ఈ నెల 27 నుంచి హిందూపురం రైల్వే స్టేషన్లో రెండు నిమిషాల పాటూ ఆగనుంది. ఈ నెల 27న రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న కాచిగూడ నుంచి వచ్చే రైలుకు పూజలు చేసి హిందూపురం నుంచి జెండా ఊపి ప్రారంభిస్తారని సౌత్ వెస్ట్రన్ రైల్వే డిప్యూటీ సీవోఎం ఎన్.రాజ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
