darmaraja dasami

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని “ధర్మరాజు “అని, “సమవర్తి” అని కూడా పిలుస్తారు.

ఏమిటీ ధర్మరాజ దశమి

చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ, ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ ధర్మరాజ దశమి రోజున వినడం ఆనందంగా ఉంటుంది.

ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును ‘వేదాంతం’ అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామజాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే, అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది.

ఎవరు ఈ నచికేతుడు?

గౌతముని వంశానికి చెందిన ‘వాజశ్రవసుడు’ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి “విశ్వజిత్‌ అనే యాగాన్ని” సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా నిరాటంకంగా ముగిసింది.

ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ, ధృడంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని, వట్టిపోయిన ముసలి ఆవులనూ, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు.

తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ, తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. తండ్రి దగ్గరకు వెళ్లి ‘ఇలా నీకు పనికిరానివాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే, ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు?’ అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది, ‘నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను అని అన్నాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి పశ్చాత్తాపపడ్డాడు. ‘ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో’ అన్నాడు. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు.

ఆ యయునికి తనను తాను అర్పించుకునేందుకు బయల్దేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ , సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు.

ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి? ఇంటికి వేళ్ళు అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. ‘ఏదో తొందరపాటుగా అన్నంతమాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి, నేనే నీకు మూడు వరాలను ఇస్తున్నాను అన్నాడు యముడు, నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి.

నచికేతుడి మూడు వరాలు.

యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా

  1. నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.
  2. స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు. అంటాడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది – ‘స్వర్గలోకే న భయం కించనాస్తి’ అంటాడు నచికేతుడు, అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు.
  3. మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు.

అప్పుడు యముడు

  1. మొదటి దానికి ‘తథాస్తు’ అన్నాడు.
  2. రెండవదానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి “నచికేత యజ్ఞం” అనే పేరు పెడతాడు.
  3. మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు, ఈ జననమరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను.’ అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. తనకి ఆ “మరణజ్ఞానాన్నే” వరంగా ఇవ్వమని నచికేతుడు మొండిపట్టు పట్టడంతో

నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. ‘సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక, పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే. దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు? అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు.

ఆత్మజ్ఞానం గురించి యముడికీ, నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది.

అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. ‘నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పదిపన్నెండు మంది పిల్లలు ఉంటే, ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను’ అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే ‘ఉత్తిష్ఠత జాగ్రత’ (లేవండి , మేలుకోండి) అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *