అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. కానీ వాటిని సరైన సమయంలో తినకపోతే పూర్తి ప్రయోజనాలు దక్కవు. రోజులో ఏ సమయంలో అరటిపండు తింటే శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటి అనేవి ఏడాది పొడవునా సులభంగా లభించే పండు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పండ్లలో ఇది ఒకటి. కానీ అరటిపండ్లను సరైన సమయంలో తింటేనే దాని నుంచి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సరైన సమయానికి తినకపోతే, అందులోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. అందుకే అరటిపండ్లు తినడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.
ఉదయం అరటిపండు తింటే
ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. ఇందులోని విటమిన్ B6, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మలబద్ధక సమస్య ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
వ్యాయామం చేసే ముందు
జిమ్కు వెళ్లే ముందు లేదా వ్యాయామం ప్రారంభించే ముందు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే కండరాలకు తిమ్మిరి రాకుండా చేయడంలో, కండరాలను బలంగా ఉంచడంలో పొటాషియం సాయపడుతుంది.
భోజనం తర్వాత
భోజనం చేసిన తర్వాత అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటిపండ్లలో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపడంలో కూడా ఇది సహాయపడుతుంది.
సాయంత్రం వేళ
సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్కు బదులుగా అరటిపండు తినడం చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి హానికరమైన స్నాక్స్ తినే అలవాటును తగ్గిస్తుంది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత వారికి అరటిపండు ఇవ్వడం ఉత్తమం. సాయంత్రం 7 గంటల తర్వాత పండ్లు తినకపోవడం మంచిది, ఎందుకంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

