మసీదు పక్కనే రెండేళ్లుగా ఉన్న కారు.. లోపల ఉన్నది చూసి ఖంగుతిన్న స్థానికులు

పేదరికం మనిషి ఏదైనా చేయిస్తుంది. ఒక్కోసారి దుర్భరమైన జీవితం గడిపేలా చేస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం రెండేళ్లుగా చిన్న కారులో జీవించాల్సి వచ్చింది. ఇప్పుడు, ఈ కుటుంబం కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలిసిన స్థానికులు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు..పేదరికం కొన్నిసార్లు మనిషి మనుగడే కష్టతరంగా మార్చే పరిస్థితికి దారి తీస్తుంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని బందర్బారు సెంతుల్ ప్రాంతంలోని ఒక మసీదు ప్రాంగణంలో రెండేళ్లుగా నిలిపి ఉంచిన పాత కారు అక్కడి స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బయటి నుండి చూస్తే అది ఎప్పుడూ స్టార్ట్ కాని పాత వాహనంలా కనిపించింది. కానీ, లోపలికి చూసినప్పుడు, ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఒక కుటుంబం మొత్తం ఒకే కారులో నివసిస్తోంది. అవును, రెండు సంవత్సరాలుగా సమీపంలోని SK శ్రీ పెరాక్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు చిన్న పిల్లలతో భార్యభర్తలు ఈ కారునే ఇంటిగా మార్చుకుని నివసిస్తున్నారు. ఈ విషాద కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాత కారులో నివసిస్తున్న ఈ కుటుంబం మెరుగైన జీవితాన్ని గడపడానికి పహాంగ్ ప్రావిన్స్లోని టెమెర్లో నుండి కౌలాలంపూర్కు వచ్చింది. కానీ ఉద్యోగాలు లేకపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అద్దె భారం వారిని వీధుల్లోకి నెట్టాయి. బహిరంగ ప్రదేశంలో నివసించకుండా ఉండటానికి ఆ కుటుంబం కారును తమ నివాసంగా మార్చుకుంది. ఫెడరల్ టెరిటరీ ఉమ్నో ఇన్ఫర్మేషన్ చీఫ్ దాతుక్ సులామ్ ముజఫర్ గులుమ్ ముస్తాకిమ్ ఈ ఫ్యామిలీ కథ తెలిసి చలించిపోయారు. ఆయన తన ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ను షేర్ చేశారు. దీనికి క్యాప్షన్గా ఇలా రాశారు…
ఈ కుటుంబం పూర్తిగా ఒక పాత కారుపై ఆధారపడి ఉంది..ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళతారు. కానీ, వీరికి ఇల్లు లాంటిది ఏమీ లేదు అని రాశారు. కారు ఎప్పుడూ కదలకుండా కనిపించేదని, కానీ, ఈ కారు లోపల ఓ కుటుంబం జీవితం సజావుగా సాగుతోందని దాతుక్ సులామ్ వివరించారు. మసీదు ఆవరణలో పార్కింగ్ సౌకర్యాలు కొంత ఆశ్రయం కల్పించాయి. కానీ వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారింది. సంఘటన వెలుగులోకి రావటంతో ఉమ్నో బటు వెంటనే చర్య తీసుకున్నారు. వారు ఫెడరల్ టెరిటరీ ఇస్లామిక్ రిలిజియస్ కౌన్సిల్ (MAIWAP)ని సంప్రదించి కౌలాలంపూర్ సిటీ హాల్ (DBKL) నుండి ట్రాన్సిట్ హౌస్ను అభ్యర్థించారు.
కుటుంబం ఉండటానికి, పిల్లలు చదువును కోల్పోకుండా ఉండటానికి తామే అద్దె ఇంటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామని దాతుక్ సులమ్ అన్నారు. మసీదు కమిటీ కూడా మద్దతుగా నిలిచిందని చెప్పారు. అప్పుడప్పుడు ఈ కుటుంబానికి ఆహారం, నీటిని అందిస్తోంది. కానీ, శాశ్వత పరిష్కారం అవసరం అని చెప్పారు. కాగా, ఈ వైరల్ పోస్ట్ వేలాది మందిని కదిలించింది. చాలా మంది ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. ఒక దీనికి స్పందిస్తూ.. మలేషియా వంటి సంపన్న దేశంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని సూచించారు.
ఇకపోతే, మలేషియాలో పేదరికం కొత్త సమస్య కాదు. COVID-19 మహమ్మారి తర్వాత ఆర్థిక మాంద్యం లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసింది. గణాంకాల శాఖ ప్రకారం, 2024లో జనాభాలో 5.6శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. కానీ, పట్టణ ప్రాంతాల్లో అద్దె, విద్య ఖర్చు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. కౌలాలంపూర్ వంటి ఖరీదైన నగరంలో ఒక చిన్న ఫ్లాట్ అద్దె 1,500 రింగిట్ (సుమారు 28,000 రూపాయలు) నుండి ప్రారంభమవుతుంది. ఇది చాలా కుటుంబాలకు భరించలేనిది. అందువల్లే ఈ కుటుంబం కారులో నివసించవలసి వచ్చింది.

