ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం

Varalakshmi Vratham Date : తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 8న శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం పూజ జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Varalakshmi Vratham 2025 Date : వరలక్ష్మీ వ్రతం హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతం ( Varalakshmi Vratham 2025 ). ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (Friday) రోజు జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్టతో, భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అష్ట లక్ష్ములు అంటే.. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు.
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
ఈ వ్రతం (Varalakshmi Vratam) లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని (Varalakshmi Vratham) ఆచరించడం ద్వారా అష్టలక్ష్మీ ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని తద్వారా ధనం, ధాన్యం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా పెళ్లయిన వివాహిత మహిళలు తమ కుటుంబం శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణం (Skanda Puranam) చెబుతోంది.
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
పవిత్రత ముఖ్యం:వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి.
మండప ఏర్పాటు: పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. దానిపై కలశం ఏర్పాటు చేయాలి.
కలశ స్థాపన: కలశం (ఇత్తడి లేదా వెండి పాత్ర) లో బియ్యం లేదా నీరు పోసి, తమలపాకులు, నాణేలు, పసుపు, కొబ్బరికాయను దానిపై ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు, కుంకుమ పెట్టి, అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. చీరతో కలశాన్ని అలంకరించడం ఆచారం.
అమ్మవారి ప్రతిష్టాపన: కలశం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
పూజా సామగ్రి సిద్ధం: పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, పండ్లు, నైవేద్యాలు, తోరాలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
తోరాల తయారీ: తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని పసుపు రాసి, దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరాలను తయారు చేయాలి. ఈ తోరాలను పూజకు ముందు పూజించాలి.
వరలక్ష్మీ వ్రతం పూజా క్రమం:
పసుపు గణపతి పూజ: ముందుగా పసుపు గణపతిని పూజించాలి. పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి.
పుణ్యాహవచనం: ఇంటిని, పూజా సామగ్రిని పవిత్రం చేయడానికి పుణ్యాహవచనం చేస్తారు.
కలశ పూజ: కలశంలోని దేవతలను ఆవాహన చేసి పూజించాలి.
వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి: అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించాలి.
తోరాల పూజ: ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి, ఒక తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి.
నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు, పాయసం, వడపప్పు, పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి.
కథా శ్రవణం: వరలక్ష్మీ వ్రత కథను చదవడం లేదా వినడం చేయడం ఎంతో శుభప్రదం.
మంగళ హారతి: పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళ హారతి ఇవ్వాలి.
ప్రదక్షిణ చేయాలి: చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి.

