అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి..
అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు (Hindu Organizations) సోమవారం నిరసనకు దిగాయి. వైసీపీ (YSRCP) హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హెచ్చరించాయి. ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి.
స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ పాపం కాదని.. మహా పాపమని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రసాదం కల్తీ చేయడమంటే భక్తుల విశ్వాసంపై దాడి చేసినట్లేనని చెప్పుకొచ్చాయి. కుట్రపూరితంగా కల్తీ చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి హిందువులే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాయి. తిరుమల క్షేత్రంపై జరిగిన కుట్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. తిరుమలపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని, వైసీపీ నేతలు వేంకటేశ్వరస్వామికి, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని హిందూ ధార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

