టీ20 ప్రపంచకప్-2026లో భారత్ బోణి కొట్టింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 162 పరుగుల లక్ష్య చేధనలో అమెరికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులే చేయగలిగింది. అమెరికా బ్యాటర్లలో మిలింద్ కుమార్ (34), సంజయ్ కృష్ణమూర్తి (37) చివరి వరకూ పోరాడినా ఫలితం లేకుండాపోయింది. భారత బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో రెండేసి వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్కు కఠిన పరీక్ష ఎదురైంది. వరుసగా వికెట్లు పడటంతో భారమంతా కెప్టెన్ సూర్యకుమార్ పైనే పడింది. ఎక్కడా నిరాశపడకుండా సూర్యకుమార్ యాదవ్ చివరి వరకూ పోరాటం చేశారు. హాఫ్ సెంచరీ(84 పరుగులు)తో సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి రెండు ఓవర్లలో మూడు సిక్సులు, మూడు ఫోర్లు బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 161 పరుగులు చేసింది. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) కూడా పర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లో అతడు మూడు వికెట్లు పడగొట్టడం గమనార్హం. హర్మీత్ సింగ్ 2, అలీ ఖాన్, మొహ్సిన్ తలో వికెట్ తీశారు.

