Mahardasha for that area in AP.. Establishment of flattened factory complexes..

ఏపీలోని ఆ ప్రాంతానికి మహర్దశ.. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుల ఏర్పాటు..

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కులను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలోనూ నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వీటితో పాటుగా మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలలో ఫ్లాటెడ్ ఫ్యా్క్టరీ కాంప్లెక్సులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తరలి వస్తాయని అధికారులు చెప్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎన్టీఆర్ జిల్లా దశ మారుతోంది. జిల్లాకు పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మైలవరం , విజయవాడ మధ్య, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కోసం స్థల సేకరణ కూడా పూర్తైంది. ఈ మూడు ప్రాంతాలలో కలిపి 42 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులను ఎంఎస్ఎంఈలతో పాటుగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సంస్థలకు కేటాయించనున్నారు.

ఆ రెండు చోట్లా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు..

మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. వాంబే కాలనీలో ఐదు ఎకరాల స్థలం కూడా ఎంపిక చేశారు. ఈ ఖాళీ స్థలాన్ని క్లీన్ చేసే ప్రక్రియ బుధవారం నుంచి జరుగుతోంది. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు నిర్మించనున్నారు. ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేసే ప్రక్రియ కూడా పూర్తైంది.

మరోవైపు ఎంఎస్ఎంఈల ఏర్పాటులో భాగంగా విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలలో తొలుత ఒక టవర్ నిర్మిస్తారు. మిగతా ప్రదేశంలో కామన్ ఏరియా, సెట్ బ్యాక్, ట్రీట్మెంట్ ప్లాంట్ వంటివి ఏర్పాటు చేస్తారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్నిచోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు కాగా.. మరికొన్నిచోట్ల స్థలాల గుర్తింపు జరుగుతోంది. విడతలవారీగా 175 నియోజకవర్గాలలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. పార్కుల ఏర్పాటు అనంతరం అందులోని ప్లాట్లను పరిశ్రమల ఏర్పాటుకోసం ముందుకు వచ్చే సంస్థలకు కేటాయిస్తారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top