డయాబెటిస్ ఉన్నవారు అంజీర పండ్లు తినవచ్చా? రోజుకు ఎన్ని అంజీర పండ్లు తినాలి? అంజీర ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే, కాలక్రమేణా కళ్ళు, గుండె, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక చక్కెర వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనిని వైద్యులు డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. ఇది బయటకు కనిపించని సమస్య కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు తరచుగా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, సరైన జీవనశైలిని పాటించడం చాలా అవసరం.
రోజుకు రెండు అంజీర పండ్లు..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అంజీర పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. 2019లో వచ్చిన ఒక పరిశోధన ప్రకారం, రోజుకు రెండు అంజీర పండ్లు తినడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కూడా కొంత రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు రెండు అంజీర పండ్లు తింటే చాలు. అంతకంటే ఎక్కువ తినడం మంచిది కాదు. డ్రై అంజీర అయితే నానబెట్టి తినాలి. రాత్రి పడుకునే ముందు రెండు అంజీర పండ్లను నీటిలో నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. వీలైతే బాదం, వాల్నట్లతో కలిసి తినొచ్చు. ఇది రక్తంలో చక్కెర నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అంజీర ప్రయోజనాలు
- మలబద్ధకం తగ్గుతుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి. కానీ ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
- రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- రోజూ అంజీర్ పండ్లు తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కొంతవరకు తగ్గుతుంది. ముఖ్యంగా రుతు సమస్యలు ఉన్న మహిళలకు ఇవి ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.

